సంస్కృత భాష ప్రభావం లేకుండా, తేటతెలుగులో సమగ్రమైన కావ్యాలు రాసిన మొదటి తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగు, కన్నడం, సంస్కృత భాషల్లో విరివిగా రచనలు చేసిన సోమనాథుడు, తెలుగు భాషపై సంస్కృతం ప్రభావాన్ని వ్యతిరేకించి, తన రచనల్లో అచ్చతెలుగు పదాలనే విరివిగా వాడాడు. ద్విపద ఛందోరీతిలో, వాడుక భాషలో పాల్కురికి రాసిన కావ్యాలు బహుళప్రాచుర్యం పొందాయి.
పాల్కురికి కాలం, ప్రాంతం
పాల్కురికి సోమనాధుడు క్రీ.శ. 1160 – 1240 మధ్యలో జీవించియుండవచ్చని చరిత్రకారుల అంచనా. పాల్కురికి శివకవి యుగానికి చెందిన కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనే ముగ్గురు బ్రాహ్మణ కవులలో పాల్కురికి ఒకరు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.
సోమనాథుడు వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే దంపతులకు జన్మించాడు. పుట్టుకతో బ్రాహ్మణుడైనప్పటికీ వీరశైవ మతం మీద అనురాగంతో బ్రాహ్మణమతాన్ని వదిలిపెట్టి, వీరశైవ మత దీక్ష తీసుకున్నాడు. గురువు కట్టకూరి పోతిదేవర వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.
వీరశైవ దీక్షను తీసుకున్న వారిని వీరమహేశ్వరవ్రతులంటారు. వారికి కులగోత్రాల పట్టింపు ఉండదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కులాన్ని వదిలేసి, శివపార్వతులనే తల్లిదండ్రులుగా భావిస్తారు.
పాల్కురికి సోమనాధుడు వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. కఠినమైన కులపట్టింపుల వంటి బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.
రచనలు
పాల్కురికి తెలుగులో బసవ పురాణం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, పండితారాధ్య చరిత్ర, చెన్నమల్లు సీసాలు, గద్యలు, ఉదాహరణలు, పంచకాలు, అష్టకాలు, స్తవాలు రచించారు. వాడుక తెలుగులో రాసిన ఆయన కావ్యాలు ఇప్పటికీ పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటాయి.
సోమనాథుడు సంస్కృతంలో సోమనాధ భాష్యం, రుద్ర భాష్యం, సంస్కృత బసవోదాహరణలు, వృషభాష్టకం, త్రివిధ లింగాష్ఠకం రాశారు.
కన్నడంలో సద్గురు రగడ, చెన్న బసవ రగడ, బసవలింగ నామావళి రచించారు.
శైలి
అప్పటివరకూ సంస్కృతభాష ఆధిపత్యంలో ఉన్న తెలుగుసాహిత్యంలో అచ్చతెలుగు పదాల వాడకం శివకవి యుగంలో పెరిగింది. ముఖ్యంగా సోమనాధుడు అచ్చ తెలుగు పదాలను, తెలుగు ఛందస్సును విరివిగా వాడాడు. "బసవ రగడ" అనే తేలికైన తెలుగు ఛందోరీతిని ప్రారంభించాడు. ద్విపద, రగడలే కాకుండా సోమనాధుడు ఇంకా సీసం, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదం, వన మయూరం, చతుర్విధ కందం, త్రిపాస కందం లాంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు.
అవినాష్ వెల్లంపల్లి