దర్పానికి,రాజసానికి మారుపేరు మన ఒంగోలు జాతి గిత్తలు.రైతులు ఇవి తమ దగ్గరుంటే ఎంతో విలువైన ఆస్తి తమ దగ్గరున్నట్టు బావిస్తారు.నిలువెత్తు అందం, బలమైన దేహ దారుడ్యం, కష్టించి పనిచేసే మనస్తత్వం వీటి సొంతం. ఈ గిత్తలు పరమశివుని వాహనం అయిన నందిని పోలిఉంటాయి. ఇవి ఎటువంటి వాతావరణ పరిస్ధితుల్లోనైనా తట్టుకుని నిలబడగలవు.
ఒంగోలు గిత్తలు కేవలం స్వదేశియులనే కాకుండా విదేశియులను సైతం తమ పనితనంతో కట్టి పడేసాయి.ఒక్క బ్రెజిల్ దేశంలోనే మన ఒంగోలు జాతి గిత్తలు 20 లక్షలు వరకూ ఉన్నాయంటే వీటి మీద ఎంత మక్కువో అర్ధం చేసుకోవచ్చు.అమెరికాలో ఒంగోలు గిత్తల సాయంతో బ్రహ్మస్ అనే సంకరజాతిని సృష్టిచేసారు అక్కడి శాస్త్రవేత్తలు.ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. ఆస్ట్రెలియా, మెక్సికో,మలేషియా,అర్జెంటినా, ఇండోనేషియా వంటిదేశాల్లో మన ఒంగోలు గిత్త గర్వంగా నిలబడి తెలుగుజాతి శక్తిని ప్రపంచానికి చాటిచెబుతుంది.హాలాండ్ దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పొతురాముడు అనే పేరుతో మనగిత్త విగ్రహం ఏర్పాటు చేసారట అది మన ఒంగోలు గిత్త గొప్పదనం.
అయితే ఆధునిక వ్యవసాయ సాధనాలు వచ్చాక వీటి అవసరం నానాటికీ తగ్గిపోతుంది.వ్యవసాయం కోసం కాకుండా కేవలం మాంసం కోసమే వీటిని పెంచుతున్నారు. అలాంటి దౌర్భాగ్య స్ధితి నుండి మన జాతికి గర్వకారణమైన వీటి మనుగడను కాపాడవలసిన భాద్యత అందరిపైనా ఉంది.అందుకే ప్రభుత్వం వారు నడుం బిగించి మన రాష్ట్ర ప్రభుత్వం,ఒంగోలు జాతి పశు ఉత్పత్తిదారుల సంఘం కలసి ఒంగోలు జాతి పశువుల అభివృద్ది పధకాన్ని చేపట్టారు.దీనిలో భాగంగా గుంటూరులోని లాంఫారం కేంద్రంగా వీటి అభివృద్దికి పరిశోధనలు చేస్తున్నారు.తెలుగోడి పౌరుషానికి చిహ్నమైన వీటిని రక్షించే భాద్యత తీసుకుంటే మన భావితరాల వారికి ఫోటోలోనో, సినిమాల్లోనో చూపించకుండా వారికి పరిచయం చేయగలుగుతాం.
|