కృష్ణాజిల్లాలోని కొండపల్లిలో తయారయ్యే కొండపల్లి బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.ఈ బొమ్మలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి.వీటిని ఇక్కడి కళాకారులు జీవకళ ఉట్టిపడేలా చక్కని ఆకృతి,ఆకట్టుకునే రంగులతో తీర్చిదిద్దుతారు.వీటిని కొండపల్లిలోని కొండూరు అడవుల్లో లభ్యమయ్యే మెత్తని తెల్లపోని కర్రను తీసుకువచ్చి కావలసిన సైజుల్లో ముక్కలు చేసి బావుదారు అనే ప్రత్యేక పనిముట్టుతో అనేక ఆకృతుల్లో మలుస్తారు.ఆతరువాత చూడచక్కని వర్ణాలతో వీటిని ముస్తాబు చేస్తారు. ఇలా తయారు చేసే ఈ బొమ్మలకు మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకి కలదు.ఇక్కడి బొమ్మలను అనేక రూపాల్లో మలుస్తారు.కొంతకాలం ముందు వరకూ వీరు కేవలం ఏనుగు అంబారి,దశవతారాలు,తాడిచెట్టు గుర్రం,మానవాకృతులు మొదలైన వాటిని రూపొందించేవారు.అయితే మారుతున్న కాలం ప్రకారం ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ ఆకృతులను రూపొందిస్తున్నారు. కొండపల్లి బొమ్మల తయారిపై ఆధారపడి 125 కుటుంబాల వరకూ జీవితం సాగిస్తున్నాయి.ప్రస్తుత మార్కెట్లో వస్తున్న ప్లాస్టిక్ బొమ్మల వల్ల వీటి అమ్మకాలు కొంతమేర తగ్గాయనే చేప్పాలి.ఈ కళాకారులను ఆదుకుని హస్త క్కళలను రక్షించడానికి ప్రభుత్వం లేపాక్షి,హస్తకళలు ఎంపోరియంల ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది.ఈ బొమ్మల తయారికి అవసరమయ్యే కలప కోసం కొండపల్లి అడువుల్లో 5050 ఎకరల్లో తెల్లపోని చెట్లను పెంచుతుంది. అంతరించి పోతున్న మన సంస్కృతికి చిహ్నలైన హస్తకళలను పరిరక్షించవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
|